సందర్భం ఏదైనా కానీ ట్విట్టర్ లో పోస్ట్ కానీ, కామెంట్ కానీ చేయకపోతే నేటి యువతరం ఉండలేదు. అందులోనూ ఐపీఎల్ లాంటి మెగా క్రికెట్ ఈవెంట్ లో ఊరుకుంటారా? అసలు ఆగరు. అదే జరిగింది మొన్ననే ముగిసిన ఐపీఎల్ విషయంలో కుడా.
ఐపీఎల్ 12వ సీజన్లో మార్చి 1 నుంచి మే 13వరకు మొత్తం 27 మిలియన్ల ట్వీట్లు నమోదయ్యాయి. గత సీజన్తో పోలిస్తే ఇది 44శాతం అధికం. ఎక్కువ ట్విట్లు చెన్నై సూపర్ కింగ్స్ టీం పైనే చేశారు అభిమానులు. తర్వాత స్థానంలో ముంబయి ఇండియాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఉన్నాయి. అత్యధికంగా రీట్వీట్ అయిన ట్వీట్ ''నా స్పూర్తి, నా మిత్రుడు, నా సోదరుడు, నా లెజెండ్ ఎం ధోనీ'' అని హార్దిక్ పాండ్యా మే8వ తేదీన చేసిన ట్వీట్. ఇది మొత్తం 16 వేల సార్లు రీట్వీట్ అయింది. వ్యక్తిగతంగా ధోని (తలై) గురించి అత్యధిక సార్లు ట్వీట్లు వెల్లవెత్తాయి. ఆ తర్వాతి స్థానాల్లో కోహ్లీ, రోహిత్శర్మ, హర్బజన్, రసెల్ ఉన్నారు. మెన్షన్స్ విషయానికి వస్తే ముంబయి ఇండియన్స్ డామినేషన్ స్పష్టంగా కనిపించింది. దాదాపు 63శాతం ముంబై ఇండియన్స్కు రాగా చెన్నై సూపర్ కింగ్స్కు 37శాతం వచ్చాయి.
ఐపీఎల్ను దృష్టిలో పెట్టుకొని ట్విటర్ ఐపీఎల్ ఎమోజీలను కూడా విడుదల చేసింది. ''ఫ్యాన్స్ క్రికెట్ గురించి ట్వీట్చేయడాన్ని ఇష్టపడతారు. ఈ ఏడాది ఐపీఎల్లో రికార్డు బ్రేకింగ్ స్థాయిలో 27 మిలియన్ల ట్వీట్లు వచ్చాయి. ప్రపంచ క్రీడల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి , చెప్పడానికి ట్విటర్ అత్యుత్తమ మార్గం. ఐపీఎల్ సంభాషణలు ఈ సారి విపరీతంగా పెరిగాయి'' అని ట్విటర్ ఇండియా పేర్కొంది.