ఈరోజు న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 22 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.. తొలుత బ్యాటింగ్ కి దిగి నిర్ణీత 50 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది కివీస్.. ఆ తర్వాత లక్ష్యచేధనలో భారత్ 251 పరుగులకే ఆలౌటైంది. ఇందులో రవీంద్ర జడేజా (55, 75 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ ) చివరివరకు నిలబడి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడని చెప్పాలి. భారత్ మ్యాచ్ ఓడిపోయినప్పటికి జేడేజా మాత్రం భారత మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీని, కపిల్ దేవ్లను దాటేసి కొత్త రికార్డును సృష్టించాడు.
జట్టు నుంచి నెం.7లో బ్యాటింగ్కు దిగిన అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన భారత ప్లేయర్గా జేడేజా నిలిచాడు. జేడేజా ఈ స్థానంలో 77 ఇన్నింగ్స్ లు ఆడి అందులో 26 సార్లు నాటౌట్గా నిలిచాడు. ఇక అందులో ఏడు అర్ధసెంచరీలు చేసి ఈ ప్లేస్లో భారత అత్యుత్తమ బ్యాట్స్మన్గా నిలిచాడు. ఇక అంతకుముందు ఈ స్థానంలో వచ్చి బ్యాటింగ్ చేసిన భారత ప్లేయర్ల జాబితాలో కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలతో కలిసి జేడేజా ఉన్నాడు. కానీ ఈ మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేయడంతో ఆ వారి రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు ఏడో స్థానంలో వచ్చి కపీల్ దేవ్, ధోని ఆరు అర్ధ సెంచరీలు చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు.
పరువు కోసం భారత్ - క్లీన్ స్వీప్ దిశగా కీవిస్
ఆతిధ్య జట్టును టీ20ల్లో 5-0 తో క్లీన్ స్వీప్ చేసిన భారత్ వన్డేల్లో మాత్రం 2-0తో సిరీస్ ని చేయిజార్చుకుంది.. ఇక మౌంట్ మాంగనీలో అప్రధాన్య మూడో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్లో అయిన నెగ్గి పరువు దక్కించుకోవాలని భారత్ ఆశిస్తుంటే, టీ20ల్లో జరిగిన అవమానాన్ని ఈ వన్డేతో గెలిచి వైట్ వాష్ చేసి సమానం చేయాలనీ కీవిస్ చూస్తుంది. మొత్తానికి అప్రధాన్య మ్యాచ్ కూడా రసవత్తరంగానే జరగనుంది.