సొంతగడ్డపై తొలి మ్యాచ్ను రాజస్తాన్ రాయల్స్ ఓటమితో ప్రారంభించింది. సోమవారం ఇక్కడ జరిగిన పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 14 పరుగుల తేడాతో రాజస్తాన్ను ఓడించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్లో విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్గేల్ విజృంభించి ఆడాడు. అతనికి తోడుగా సర్ఫరాజ్ఖాన్ (46 నాటౌట్) కూడా రాణించడంతో 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అటు బౌలింగ్లోనూ సత్తాచాటి రాజస్థాన్ రాయల్స్ను సమర్ధవంతంగా ప్రతిఘటించింది. పరుగుల వేటలో రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొంతమేరకు సఫలీకృతమైనప్పటికీ మిడిలార్డర్ ఘోరంగా విఫలమైంది. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 170 పరుగులకే పరిమితమైన రాజస్థాన్ రాయల్స్కు ఓటమి తప్పలేదు.