చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్–12లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో బెంగుళూరును చిత్తుచేసిన ధోని సేన.. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ ను కూడా ఓడించి రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో చెన్నై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై చెన్నై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (47 బంతుల్లో 51; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో జట్టును ఆదుకోగా.. మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ నమోదు చేయలేదు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రేవోకు 3 వికెట్లు దక్కాయి.
అనంతరం 147 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసి విజయాన్నందుకుంది. చెన్నై ఆటగాళ్లలో ఓపెనర్ వాట్సన్ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కాసేపు ఢిల్లీ బౌలర్లను ఆటాడుకున్నాడు. గత మ్యాచ్లో డకౌట్ అయిన వాట్సన్ ఈసారి తన ధాటిని ప్రదర్శించాడు. అక్షర్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను, రబడ తొలి ఓవర్లో కూడా వరుసగా 4, 6 బాదాడు. ఆ తర్వాత అమిత్ మిశ్రా ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు... అయితే అదే ఓవర్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. రైనా (16 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఎమ్మెస్ ధోని (35 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), జాదవ్ (34 బంతుల్లో 27; 2 ఫోర్లు) గౌరవప్రద స్కోర్ చెయ్యడంతో సూపర్ కింగ్స్ విక్టరీ కొట్టింది.