యువ సంచలన ఆటగాడు రిషభ్ పంత్ బెబ్బులిలా రెచ్చిపోయాడు. రాజస్తాన్ బౌలర్లను చీల్చి చెండడంతో భారీ స్కోర్ కూడా చిన్నదైపోయింది. దీంతో రాజస్తాన్ రాయల్స్ పై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఐపీఎల్లో భాగంగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. రహానె (63 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 నాటౌట్) అజేయ శతకం సాధించగా స్టీవ్ స్మిత్ (32 బంతుల్లో 8 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. రబాడకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసి నెగ్గింది. పృథ్వీ షా (42) రాణించాడు. ఆరంభం నుంచే తనదైన రీతిలో రెచ్చిపోయిన పంత్ ఎడాపెడా బౌండరీలు సాధించాడు. పంత్(78 నాటౌట్; 36 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సర్లు) చివరి వరకు ఉండి జట్టుకు విజయాన్నందించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పంత్ నిలిచాడు.