సిరీస్ కోల్పోయిన భారత్..

Update: 2019-03-13 15:46 GMT

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఫెరోజ్ షా కోట్లా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 35 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగుకు ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖవాజా (100; 106 బంతుల్లో 10×4, 2×6) రెండో శతకంతో ఆకట్టుకున్నాడు. పీటర్ హాండ్స్‌కాంబ్‌ (52; 60 బంతుల్లో 4×4) అర్ధశతకం సాధించాడు. టీమిండియా బౌలర్లు చివరి 20 ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసీస్‌ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. దాంతో 50 బంతుల వ్యవధిలో నలుగురు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. టర్నర్‌కు తోడుగా చివరి వరస బ్యాట్స్‌మెన్‌ రిచర్డ్‌సన్‌, కమిన్స్‌ల రాణింపుతో ఆస్ట్రేలియా జట్టు 272 పరుగులు చేయగలిగింది. ఇక 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది..

కమ్మిన్స్ వేసిన 5వ ఓవర్ రెండో బంతికి ధవన్(12) క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు నిలకడగా ఆడుతూ.. స్కోర్‌ను పెంచే ప్రయత్నం చేశారు. కానీ.. స్టోనిస్ వేసిన 13వ ఓవర్ మూడో బంతికి కోహ్లీ(20) క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో బ్యాటింగ్‌కి వచ్చిన రిషబ్ పంత్(16) 18వ ఓవర్ ఐదో బంతికి పెవిలియన్ బాటపట్టాడు. విజయ్‌ శంకర్‌ (16 పరుగులు) తక్కువ పరుగులకే పెవిలియన్‌ బాట పట్టారు. ఇక, రవీంద్ర జడ్డేజా డకౌట్‌ అవ్వగా.. ఆ తరువాత ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాటపట్టారు. దీంతో 237 పరుగులకు భారత్ అల్ అవుట్ అయింది. ఆసీస్ బౌలర్లలో ఆడం జాంప 3 వికెట్లు, కుమ్మిన్స్ , స్టోనిస్, రీచర్డ్సన్ తలో రెండు వికెట్లు, లియోన్ ఒక వికెట్ తీశారు. దీంతో ఆసీస్ 3-2 తో సిరీస్ చేజిక్కించుకుంది.  

Similar News