పోలీసులు చేసే ఎన్కౌంటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత కోర్టు దృష్టికి తీసుకెళ్లాలన్న అత్యున్నత న్యాయస్థానం ఎన్కౌంటర్లపై చట్ట ప్రకారం దర్యాప్తు చేయాలని తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. పోలీసులు చేసే ఎన్కౌంటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు తర్వాతే కోర్టు దృష్టికి తీసుకురావాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది.
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 నమోదు చేయాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సుప్రీంలో సవాల్ చేశాయి. తాజాగా ఈ అంశంపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఎన్కౌంటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ తీర్పు వెలువరించింది. మరోవైపు ఎన్కౌంటర్లపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కూడా గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వీటిని పరిశీలించిన సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీచేసింది.