రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ బుజ్జగిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ సీనియర్ నేత శివకుమార్ కొద్దిసేపటి క్రితం రెబల్ ఎమ్మెల్యే నాగరాజు నివాసానికి వెళ్లారు. రాజీనామా వెనక్కి తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా నాగరాజును కోరారు. కన్నడ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ సంక్షోభంలో కూరుకుపోయిన క్రమంలో అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని, సమయం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కుమారస్వామి అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ను నిన్న కోరారు.
16 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో కుమారస్వామి విశ్వాస పరీక్షకు కోరడం ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో మళ్లీ రిసార్టు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అయితే, మూడు పార్టీల ఎమ్మెల్యేలను వేర్వేరు రిసార్టులకు తరలించారు. అయితే రాజీనామా చేసిన వారెవ్వరూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. కాంగ్రెస్ – జేడీఎస్ నిర్దేశించిన రిసార్టులకు కూడా వెళ్లలేదు. కొందరు ముంబయిలో ఉండగా మరికొందరు బెంగళూరులోనే ఉన్నారు.