ముంబైలో రెడ్ అలర్ట్
ముంబై నగరాన్ని మరోసారి వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. 24 గంటల వ్యవధిలో వంద మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
ముంబై నగరాన్ని మరోసారి వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. 24 గంటల వ్యవధిలో వంద మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వడేలాలో 167 మి.మీ., విక్రోడీలో 162 మి. మీటర్ల వర్షం కురిసింది. ముంబైతో పాటు థానే, ఫూణెలోని చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి చెరువులను తలపించాయి.
రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. బయటకు రావాలంటే నగరవాసులు అవస్థలు పడుతున్నారు. రైల్వే స్టేషన్లోకి నీళ్లు రావడంతో పలు లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలతో ముంబై , థానే, కొంకణ్ ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మరో 48 గంటల పాటు ముంబైలో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.