అయోధ్య కేసు తుది తీర్పు వెలువడింది. ఈ నేపథ్యంలోనే జమ్మూకశ్మీర్తో పాటుగా మరికొన్ని సున్నితమైన ప్రాంతాలలో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతాల్లోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి భద్రతా బలగాలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ను విధించారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో తీర్పుకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు చేయకుండా ఇంటర్నెట్ సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
రాజస్థాన్లో కూడా 144 సెక్షన్ను విధించారు ఈ కర్ఫ్యూ నవంబర్ 19 వరకు అమల్లో ఉండనుందని అక్కడి భద్రతా సిబ్బంది తెలిపింది. రాజస్థాన్ తో పాటు మహారాష్ట్రలోనూ 144 సెక్షన్ విధించారు. రేపు అంటే నవంబర్ 9 వ తేదీ వరకు ఉదయం 11 గంటలకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అక్కడి పోలీసు బలగాలు తెలిపారు. అంతే కాకుండా రాజస్థాన్ ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. అజ్మీర్లో రేపు ఉదయం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను పనిచేయకుండా నిలిపివేశారు.