భారత దేశంతో కాశ్మీర్ ఇప్పుడు అనుసంధానం అయింది: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
భారత దేశంతో జమ్ము కశ్మీర్ ఇప్పుడు పూర్తిగా అనుసంధానమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆయన రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు పై మాట్లాడుతూ "370 కారణంగా కశ్మీర్కు చెందిన చాలా కుటుంబాలు అక్కడ దరిద్రంలో జీవిస్తున్నాయి. దీనిని అడ్డం పెట్టుకొని కొన్ని కుటుంబాలు అక్కడి ప్రజలను దోచుకొన్నాయి. మహారాజ హరిసింగ్ చేత భారత్లో కలుపుతూ అంగీకార పత్రంపై సంతకం చేశారు. అప్పట్లో ఆర్టికల్ 370 లేదు. ఆ తర్వాత వచ్చింది. ఆర్టికల్ 370 జమ్ము కశ్మీర్ను భారత్తో మమేకం కానివ్వలేదు. కశ్మీర్ను అడ్డం పెట్టుకొని కొన్ని పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేశాయి. మోదీ ప్రభుత్వానికి ఆ అవసరం లేదు. సభ్యులు అందరూ చర్చించాలి. ఆర్టికల్ 370 వచ్చాకే కశ్మీర్లో అరాచకాలు మొదలయ్యాయి. కశ్మీర్లో దళితులకు రిజర్వేషన్లు దక్కలేదనే విషయం దేశానికి తెలియాలి. కశ్మీర్లోకి వెళ్ళే అత్యధిక నిధులు ఎక్కడి పోతున్నాయో చర్చించాలి. నేను ప్రతి దానికి సమాధానం ఇస్తాను. ఆర్టికల్ 370 తొలగించడంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకూడదు.'' అని అమిత్ షా పేర్కొన్నారు.