సంకీర్ణ కూటమి వ్యూహాలతో ఘడియకో మలుపు తిరిగిన కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెరపడలేదు. క్షణ క్షణం ఉత్కంఠ రేపిన 'కుమార' బల పరీక్ష వ్యవహారం సోమవారం అర్ధరాత్రి అయినా ఎటూ తేలకపోవడంతో విధాన సభ మంగళవారానికి వాయిదా పడింది. నేటి సాయంత్రం 4గంటలకు బలాన్ని నిరూపించుకోవాలని స్పీకర్ రమేశ్ కుమార్ అధికార పక్షానికి డెడ్లైన్ విధించారు. కాంగ్రెస్ తరఫున కొంత మంది మాట్లాడాల్సి ఉందని, రాత్రి 8గంటల వరకు సమయం ఇవ్వాలని సిద్ధరామయ్య కోరగా అందుకు సాధ్యం కాదని స్పీకర్ తేల్చి చెప్పారు. దీంతో మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు చర్చను ముగించి.. సాయంత్రం 6గంటలకు విశ్వాస పరీక్షను నిర్వహిస్తామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
కర్ణాటకలో మూడు వారాల క్రితం అధికార కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో మొదలైన రాజకీయ సంక్షోభం.. గత వారం కుమారస్వామి అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో తారస్థాయికి చేరింది. ఈ తరుణంలో గత వారంలో రెండు రోజుల పాటు చర్చించిన విధానసభ ఏ నిర్ణయం లేకుండానే వాయిదా పడి తిరిగి సోమవారం ప్రారంభమైంది. స్పీకర్ ఎట్టిపరిస్థితుల్లో సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించాలని ప్రయత్నించినా చివరకు సభలో నెలకొన్న పరిస్థితుల రీత్యా ఆయన సభను మంగళవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది.
మరోవైపు, గత వారంలో రెండుసార్లు విశ్వాస పరీక్షకు ముగింపు పలకాలంటూ సీఎం, స్పీకర్కు సూచించిన గవర్నర్ వాజూభాయి వాలా చివరకు సోమవారం నిర్ణయం తీసుకోకపోతే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సమావేశమైన విధానసభలో సోమవారం మధ్యాహ్నం నుంచీ అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీ విమర్శలకు దిగారు. దీంతో సభ వేడెక్కింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విపక్ష బీజేపీ కుట్రలు చేస్తోందని అధికార పార్టీ విమర్శించగా.. బలంలేకపోయినా ప్రభుత్వంలో కొనసాగుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ బీజేపీ మండిపడింది. సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహిస్తామని ఇచ్చిన మాటపై కట్టుబడి ఉండాలని స్పీకర్ రమేశ్కుమార్ పదేపదే అధికార పక్షానికి సూచిస్తూ వచ్చారు. ఒక దశలో తనను బలిపశువుని చేయొద్దని కూడా అన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తేలే వరకు ఓటింగ్ ఆపాలని కాంగ్రెస్ కోరగా.. కుమారస్వామి కూడా విశ్వాస పరీక్ష ముగింపునకు మరో రెండు రోజులు కావాలని కోరారు.
అయితే, అధికార, విపక్ష సభ్యులు మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ సూచించారు. బీజేపీ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో సోమవారమే ఓటింగ్ నిర్వహించాలని పట్టుపట్టింది. దీంతో సోమవారం రాత్రి 9గంటల లోపు బలపరీక్ష నిరూపించుకోకుంటే తాను పదవి నుంచి వైదొలుగుతానని స్పీకర్ హెచ్చరించారు. అయినా తేలకపోవడంతో స్పీకర్ రమేశ్కుమార్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.