జార్ఖండ్ 11 వ సీఎంగా.. హేమంత్ సోరేన్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ద్రౌపదీ ముర్మా.. ఆయనచేత ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్ర రాజధాని రాంచీ లోని మోరాబడి గ్రౌండ్లో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విపక్ష పార్టీల హేమాహేమీలంతా తరలివచ్చారు. ప్రమాణస్వీకారం చేసిన సోరేన్ను అభినందనలతో ముంచెత్తారు. అయితే ఈ కార్యక్రమాన్ని విపక్షాల బలప్రదర్శనగా అభివర్ణిస్తున్నారు. కాంగ్రెస్ యువనేత రాహుల్గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్, ఛత్తీస్ఘడ్ సీఎం భూపేశ్ బఘేల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, డీఎంకే అధినేత స్టాలిన్, అఖిలేష్ యాదవ్, తేజస్వీయాదవ్ వంటి పెద్దలంతా దిగివచ్చారు.
81 స్థానాలున్న జార్ఖండ్ లో.. జేఎంఎం 30 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ 16, ఆర్జేడీ ఒక స్థానం దక్కించుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనుకున్న బీజేపీ మాత్రం.. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇటు అసెంబ్లీలో బల ప్రదర్శన తర్వాతే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది.