ముంబైలో భారీ వర్షం...రోడ్లన్నీ జలమయం

Update: 2019-06-28 06:58 GMT

ముంబైలో భారీ వర్షం కురిసింది. విరార్, జుహు, ములుంద్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ కు అంతరాయం కలుగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుతుపవనాల రాకతో ఈ ఏడాది దేశంలోనే మొదటిసారి భారీవర్షం ముంబై లో కురిసింది.నగరంలోని లోతట్టుప్రాంతాల్లో వరద పోటెత్తిన నేపథ్యంలో ప్రజలు మ్యాన్ హోళ్లను తెరవరాదని బృహన్ ముంబై అధికారులు కోరారు. వరద పీడిత ప్రాంతాల్లో ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని ముంబై హైకోర్టు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. వరదనీరు ముంబైను ముంచెత్తిన నేపథ్యంలో అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

భారీ వర్షం కారణంగా ముంబై విమానాశ్రయంలో భారీగా వరద నీటితో పాటు మట్టి వచ్చి చేరింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌పోర్టు అధికారులు పలు విమానాలను దారి మళ్లిస్తున్నారు. అంతర్జాతీయ విమానాలను శంషాబాద్‌కు తరలిస్తున్నారు. ముంబై నగరం భారీవర్షంతో మళ్లీ మునిగింది అంటూ పలువురు నెటిజన్లు వరదనీటి కాల్వల ఫోటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారు. 

Similar News