మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఉదయం 10.30గంటలకు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఏప్రిల్ 1న రాబర్ట్ వాద్రాకు మంజూరైన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఇపుడు ఈడీ సమన్లు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది .
రాజస్థాన్ రాష్ట్రంలో బికానేర్లోని ఆస్తుల విషయంలో అవకతవకలు జరిగాయని వాద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. తాజాగా మరోసారి హాజరుకావాలని ఈడీ కోరింది. కాగా, విచారణకు వాద్రా సహకరించడం లేదని.. ఆయన్ను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. దీనికి ముందస్తు బెయిల్ ఆటంకంగా మారిందని వివరించింది. ఈడీ వ్యాజ్యంపై తన స్పందనను తెలియజేయాలని వాద్రాను సోమవారం కోర్టు ఆదేశించింది.