కన్నడ సంక్షోభానికి కారణమైన అసమ్మతి ఎమ్మెల్యేలు మరో అడుగు ముందుకేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదంటున్న రెబల్స్ ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తమ రాజీనామాలు ఆమోదించేలా స్పీకర్ను ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు రెబల్స్ను బుజ్జగించేందుకు ముంబై వచ్చిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్కి ఊహించని షాక్ తగిలింది. కర్నాటక సంక్షోభం మరో కొత్త మలుపు తిరిగింది. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఎటూ తేల్చకపోవడంతో కన్నడ రాజకీయం సుప్రీంకోర్టుకు చేరింది. తమ రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ అసమ్మతి ఎమ్మెల్యేలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ రాజీనామాలను ఆమోదించకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు రెబల్ ఎమ్మెల్యేల క్యాంప్కి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ రావడంతో ముంబై హోటల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డీకేను కలిసేందుకు నిరాకరించిన అసమ్మతి ఎమ్మెల్యేలు కుమారస్వామి, శివకుమార్ నుంచి తమకు ముప్పు ఉందంటూ ముంబై పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. దాంతో శివకుమార్కి కేటాయించిన గదిని హోటల్ యాజమాన్యం రద్దుచేసింది. అయితే అసమ్మతి ఎమ్మెల్యేలను కలిసేవరకు హోటల్ను విడిచివెళ్లేది లేదంటూ శివకుమార్ భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే హోటల్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ఇక అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలపై హడావిడిగా రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోలేమని మరోసారి స్పీకర్ రమేష్ కుమార్ తేల్చిచెప్పారు. ఈనెల 17వ తేదీ వరకూ రెబల్స్కు తాను టైమిచ్చానని, ఇలాంటి సందర్భాల్లో విధివిధానాలు ఎలాగుంటాయో తూచ తప్పకుండా పాటిస్తానని చెప్పుకొచ్చారు.