ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు

Update: 2019-07-27 08:06 GMT

వస్తు సేవల పన్ను(జీఎస్టీ) మండలి ఈరోజు ఢిల్లీలో సమావేశమయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. నిర్మలా సీతారామన్​ ఆధ్వర్యంలో భేటీ అయిన 36 వ జీఎస్టీ కౌన్సిల్ విద్యుత్తు వాహనాలు, ఈ వాహనాల చార్జీలపై జీఎస్టీ తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది.ఎలక్ట్రిక్‌ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఈవీ చార్జర్లపై జీఎస్‌టీనీ 18 నుంచి తగ్గించి 5 శాతంగా ఉంచింది. తగ్గించిన ధరలు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి.

దీంతో పాటు స్థానిక సంస్థలు అద్దెకు తీసుకునే ఎలక్ట్రిక్ బస్సులకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనకు కూడా జీఎస్టీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బస్సులను అద్దెకు తీసుకుంటే వాటిపై కూడా జీఎస్టీని మినహాయించాలని ఈ భేటీలో తీర్మానించినట్లు చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం గత గురువారమే జరగాల్సినప్పటికీ నిర్మలా సీతారామన్ పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనాల్సి రావడంతో ఈ భేటీ వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కావడం ఇదే తొలిసారి.

Tags:    

Similar News