కార్యాలయానికి సైకిల్‌పై వచ్చిన కేంద్ర మంత్రి

Update: 2019-06-03 14:06 GMT

బీజేపీ సీనియర్ నేత డాక్టర్ హర్షవర్థన్ తన ప్రత్యేకతను చాటారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆయనకు ప్రధాని మోడీ తన రెండో మంత్రివర్గంలో ఆరోగ్య శాఖను కేటాయించారు. దేశ ప్రజలను ఆరోగ్య కరంగా ఉంచడమే ఆయన కర్తవ్యం. అందుకే బాధ్యతలను చేపట్టే రోజు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రచారం చేయాలని భావించిన ఆయన.. ఇంటి దగ్గరి నుంచి సచివాలయానికి సైకిల్‌పై వెళ్లి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అందువల్ల దీనిని తెలియజేసేందుకే హర్షవర్థన్ సైకిల్‌పై వచ్చి బాధ్యతలు స్వీకరించారు. సైకిల్ అందుబాటు ధరలో ఉండే రవాణా సాధనమే గాక... ఆరోగ్యకరమైనది కూడా అని మంత్రి తెలిపారు.

ఆరోగ్య రంగంలో ప్రధాని మోడీ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లామని.. ఆరోగ్యకర భారతవని కోసం అన్ని చర్యలు తీసుకుంటామని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకునేలా అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ప్రజలందరికీ చేరేలా చూస్తామని హర్షవర్ధన్ హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News