నల్లధనం.. మన దేశ ఆర్ధిక వ్యవస్థకు పెద్ద శాపం. లక్షలాది కోట్ల రూపాయలను మన దేశం నుంచి ధనాన్ని విదేశాలకు తరలించేశారు. దీనికి సంబంధించిన విస్తుకోలిపే అంశాలు వివిధ ఆర్ధిక సంస్థలు చేసిన అధ్యయనాల్లో వెల్లడి అయ్యాయి. అగ్రశ్రేణి సంస్థలైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ ఫైనాన్స్ (ఎన్ఐపీఎఫ్పీ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసర్చ్ (ఎన్సీఏఈఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ (ఎన్ఐఎఫ్ఎం) నిర్వహించిన మూడు వేర్వేరు అధ్యయనాల్లో వెల్లడైన అంశాలను సోమవారం ఆర్ధిక వ్యవహారాల స్థాయీ సంఘం లోక్సభకు అందించింది. ఆ వివరాల ప్రకారం 1980 నుంచి 2010 మధ్య భారతీయులు వివిధ సమయాల్లో విదేశాల్లో దాచిన అక్రమ సంపద దాదాపు 216.48 బిలియన్ డాలర్ల నుంచి 490 బిలియన్ డాలర్ల వరకు (ప్రస్తుత విలువ ప్రకారం చూస్తే సుమారు రూ.15లక్షల కోట్ల నుంచి రూ.34 లక్షల కోట్ల వరకు) ఉన్నట్లు నివేదిక తెలిపింది. రియల్ ఎస్టేట్, గనులు, ఔషధాలు, పాన్ మసాలా, గుట్కా, పొగాకు, బంగారం, కమోడిటీలు, సినిమాలు, విద్యా రంగాల నుంచి ఈ లెక్కల్లో లేని సొమ్ము విదేశాలకు తరలి పోయినట్టు ఆ అధ్యయనాలు వెల్లడించాయి.
అయితే నల్లధనం ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడ పోగుపడుతోందన్న విషయమై కచ్చితమైన అంచనాలు లేవని, అలాంటి అంచనాలు వేయడానికి కచ్చితమైన, ఆమోదయోగ్యమైన పద్ధతి కూడా లేదని 'దేశం లోపల, వెలుపల లెక్కల్లోకి రాని ఆదాయం/ఆస్తుల పరిస్థితి- ఓ శాస్త్రీయ విశ్లేషణ' అనే పేరుతో రూపొందించిన నివేదికలో స్థాయీ సంఘం పేర్కొంది. అంచనాలన్నీ పలు సర్దుబాట్లను పరిగణనలోకి తీసుకొని ఊహల ఆధారంగానే రూపొందించారని వివరించింది. ఇందుకు ఉపయోగించాల్సిన అత్యుత్తమ పద్ధతి లేదా విధానంపై ఏకరూపత, ఏకాభిప్రాయం రాలేదని తెలిపింది. ఈ నివేదిక అంచనాల ప్రకారం విదేశాల్లో అక్రమంగా మూలుగుతున్న భారతీయుల నల్లధనం రూ15,00,000 కోట్ల నుంచి రూ.34,00,000 కోట్లు. ఇది మన దేశ బడ్జెట్ కన్నా ఎక్కువ.