నూతన సంవత్సరం ప్రారంభం అయిన రెండు రోజులకే బ్యాంకు యూనియన్లు వారి డిమాండ్లను తీర్చాలని సమ్మె చేసాయి. ఈ నేపథ్యంలోనే మరో సారి సమ్మె సైరన్ మోగించబోతున్నాయి. వేతన సవరణను యుఎఫ్బీయూ కనీసం 15 శాతం పెంచాలని, 12.25 శాతం వేతనాల పెంపు, స్పెషల్ అలవెన్స్ను బేసిక్ పేలో కలపడం, వారానికి ఐదు రోజుల పని దినాలపై ఐబీఏ ఇచ్చిన ఆఫర్పై అంగీకారం తెలపాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయన్నారు.
వారి డిమాండ్లపై భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ)తో వేతన సవరణపై చర్చలు ముందుకు సాగకపోవడంతో సమ్మెకు పిలుపునిస్తున్నామని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్బీయూ) ప్రకటించింది. జనవరి 31, ఫిబ్రవరి ఒకటో తేదీన సమ్మె చేయాలని బుధవారం బ్యాంకు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెకు తొమ్మిది కార్మిక సంఘాలకు ప్రాతినిధ్య వహిస్తున్న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్బీయూ) మద్దతు తెలుపుతుంది. అంతే కాకుండా తమ డిమాండ్లను తీర్చకపోతే 2020 మార్చి 11 నుంచి 13వ తేదీ వరకు కూడా సమ్మెను నిర్వహించనున్నట్లు తెలిపింది. అప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని బ్యాంకు యూనియన్లు తెలిపాయి.