జమ్మూకశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
♦ఉగ్రదాడిలో ఆరుగురు కూలీలు మృతి, మరొకరి పరిస్థితి విషమం ♦కశ్మీర్లో యూరప్ ఎంపీల బృందం పర్యటన రోజే దుశ్చర్య
జమ్మూ కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొట్టమొదటి సారిగా పెట్రేగిపోయారు. జమ్మూలోని కుల్గాం ప్రాంతంలో పనిలో నిమగ్నమైన కూలీలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఆరుగురు కూలీలు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని స్థానిక అనంతనాగ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారంతా పశ్చిమబెంగాల్లోని ముర్షీదాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ నుంచి పొట్టచేతబట్టుకుని కశ్మీరుకు వచ్చిన వీరంతా దినసరి కూలీలు.
ఉగ్రవాదుల కోసం 18 భద్రతా బలగాలు మరియు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు దాడులు చేయడం కలకలం సృష్టిస్తోంది. కేంద్రం ఈ మధ్యే జమ్మూలో ఆంక్షలు తొలగించింది. ఉగ్రవాదులు కశ్మీర్లో ఎలా చొరబడ్డారు, దాడికి చేసిన ప్రణాళికలు మొదలైన అంశాలపై జవాన్లు విచారణ చేస్తున్నారు.
ఇక జమ్ము కశ్మీర్లో క్షేత్రస్ధాయి పరిస్ధితులను పర్యవేక్షించేందుకు యూరప్ ఎంపీల బృందం కశ్మీర్లో పర్యటిస్తోంది.పర్యటనకు వచ్చిన రోజునే ఈ దుశ్చర్య చోటు చేసుకోవడం గమనార్హం. రాగల 48 గంటల పాటు ఢిల్లీ హై అలర్ట్లో ఉంటుంది. ఈ నెల 31వ తేదీన జమ్మూ-కశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించనున్న నేపథ్యంలో ఉగ్రముఠాల హిట్లిస్టులో ఢిల్లీ కూడా ఉందని నిఘావర్గాలు సమాచారం అందించాయి. దీంతో దేశ రాజధానిలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.