బీసీ గర్జన పేరుతో వైసీపీ రెడీ...గర్జన సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న జగన్
ఈ సారి అడుగులు విజయం వైపే వెయ్యాలి. అందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దనుకుంటున్నారు వైసీపీ శ్రేణులు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు మరోసారి రిపీట్ కానివ్వకూడదని పక్కా ప్రణాళికలను రెడీ చేసుకుంటున్నారు. సామాజిక వర్గాల వారీగా లెక్కలేసుకుటున్న వైసీపీ తాజాగా బీసీలపై ఫోకస్ చేసింది.
ఏపీ రాజకీయ పార్టీలు ప్రస్తుతం బీసీ మంత్రాన్ని జపిస్తున్నాయి. నేతల తలరాతలను మార్చే బీసీలను తలకెక్కించుకుంటున్నాయి. కులాల వారీగా లెక్కలు కట్టి ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా టీడీపీ జయహో బీసీ అంటూ ఆయా వర్గాలపై వరాల వర్షం కురిపించగా ప్రతిపక్ష వైసీపీ కూడా తామేం తక్కువ తిన్లేదంటూ బీసీ గర్జన పేరుతో ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
గత ఎన్నికల్లో ఎదుర్కొన్న అనుభవాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రతిపక్ష వైసీపీ అదినేత జగన్. ఈ నేపథ్యంలో పార్టీకి దూరంగా ఉన్న సామాజిక వర్గాలపై ఆయన దృష్టి సారించారు. బీసీలు గత ఎన్నికల్లో వైసీపీకి దూరంగా ఉన్నారనే ప్రచారం నడిచింది. అయితే వచ్చే ఎన్నికల్లో అదే పరిస్థితి పునరావృతం కాకూడదని జగన్ భావిస్తున్నారు.
బిసీ సామాజిక వర్గంలోని వివిద కులాలకు సంబందించిన సమస్యలను అధ్యయనం చేసేందుకు బిసీ అధ్యయన కమిటీని జగన్ ఏర్పాటు చేశారు. ఈ కమిటి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి బీసీల సమస్యలు, వారి స్థితిగతులను అధ్యయనం చేసింది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో నియోజకర్గాల వారిగా తిరిగి బిసి ప్రజల సమస్యలు తెలుసుకుంది. వీటితో పాటు బిసీ కులాలకు చెందిన ముఖ్య నేతలు, మేదావులు, ఉద్యోగ, విద్యార్ధి సంఘాల నేతలతోనూ సమావేశాలు నిర్వహించింది.
అధ్యయన కమిటీ సేకరించిన అంశాల ముసాయిదాను ఈ నెల 28 న అధినేత జగన్కు కమిటీ అందజేయనుంది. జగన్తో సమావేశం తర్వాత ఫిబ్రవరి 19 న ఏలూరులో పెద్ద ఎత్తున బిసీ గర్జన సభకు ప్లాన్ చేస్తున్నారు. ఈ గర్జనలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బిసీలను తమవైపు తిప్పుకోవాలని యోచిస్తున్నారు. దీంతో బీసీలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యత కల్పిస్తాం అనే అంశాన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల నాటికి బీసీలను తమవైపు తిప్పుకునేందు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. మరి వైసీపీ ప్రయత్నాలకు బిసిలు ఎలాంటి మద్దతు ఇస్తారో చూడాలి.