వివేకానంద హత్యతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. హత్య దగ్గర నుంచి విచారణ వరకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మరోవైపు ఎన్నికల సమయం కూడా కావడంతో ఇరు పార్టీల అధినేతల మాటల తూటాలు, పొలిటికల్ హీట్ ను పెంచేస్తున్నాయి. జగన్ అయితే, ఏకంగా రాజ్భవన్ తలుపు తట్టి సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని కోరారు.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యతో ఏపీ రాజకీయాల్లో మొదలైన ప్రకంపనలు.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మరింత హీట్ ను రాజేస్తోంది. వివేకానంద హత్యను సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ మాత్రం, సిట్పై తమకు నమ్మకం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. గవర్నర్ నరసింహన్ను రాజ్భవన్లో కలిసిన జగన్.. వివేకా హత్య ఘటనపై ఫిర్యాదు చేశారు. వివేకానంద హత్యపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. ఈ హత్యలో టీడీపీ హస్తం లేకపోతే, సీబీఐ విచారణకు ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని జగన్ ప్రశ్నించారు.
వివేకానంద రెడ్డి మృతిని కూడా వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు చంద్రబాబు. హత్యానంతరం గుండెపోటు అని నమ్మించేందుకు తప్పుడు ప్రచారం చేశారని, దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు మరిన్ని అడ్డదారులు తొక్కారని చంద్రబాబు విమర్శించారు. చిన్నాన్న హత్యకు గురైతే, దోషులపై కఠిన చర్యలు తీసుకొనేలా డిమాండ్ చేయకుండా.. జగన్, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో మోడీ ఉన్నారనే జగన్ సీబీఐ విచారణ కోరుతున్నారని చంద్రబాబు తెలిపారు.
వివేకానందరెడ్డిని హత్య చేశారనే వార్త తెలిస్తే, జిల్లాలో అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని అందుకే విజ్ఞతతో వాస్తవాలు తెలిసే వరకు హత్య అని ప్రకటించలేదన్నారు మాజీ ఎంపీ అవినాశ్ రెడ్డి. వివేకా హత్య ఉదంతాన్ని ఏపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డారు. సిట్ విచారణతో ఉపయోగం లేదని, వివేకా హత్యపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని అవినాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోందని త్వరలోనే నిందితులెవరో తేలిపోతుందని అధికార పార్టీ అంటోంది. వైసీపీ మాత్రం, రెండు రోజుల్లో వివేకానంద హత్య కేసును సీబీఐకి అప్పగించకపోతే కోర్టు మెట్లు ఎక్కుతామని అంటోంది.