ఉత్తర తెలంగాణలో చెల్లెలు కవితను అస్త్రంగా సంధించారు కేటీఆర్. తూర్పు యూపీలో, ప్రియాంక అనే బ్రహ్మాస్త్రాన్ని వదిలారు రాహుల్ గాంధీ. ఆంధ్రప్రదేశ్లో కూడా చెల్లెల్ని బాణంలా విసరబోతున్నారు యువ నాయకుడు. రాయలసీమ రణక్షేత్రంలో తన సోదరిని రంగంలోకి దించబోతున్నారు. వైఎస్ షర్మిల. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాల కూతురు. వైసీపీ అధినేత జగన్ చెల్లెలు. జగనన్న వదిన బాణాన్నంటూ, పాదయాత్రతో తెలుగు రాష్ట్రాలను చుట్టేసి, పార్టీని నిలబెట్టారు. ఇప్పుడు మరోసారి ఎన్నికల టైంలో, బాణమై దూసుకొచ్చేందుకు సిద్దమవుతున్నారు.
పాదయాత్ర తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు షర్మిల. 2014 ఎన్నికల్లో కూడా తాను ఎక్కడా పోటీ చెయ్యలేదు. ఈ నేపథ్యంలో షర్మిల మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తున్నారంటూ పార్టీలో చర్చ జరుగుతోంది. అతి త్వరలోనే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారంటూ పార్టీలో ముఖ్య నేతలు చెబుతున్నారు. అంతేకాదు, షర్మిలకు పార్టీలో కీలక బాధ్యతలు కూడా ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో షర్మిలకు రాయలసీమ బాధ్యతలు ఇవ్వాలని జగన్, ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో సీమలో అనంతపురం మినహా మిగిలిన మూడు జిల్లాల్లో వైసీపీ మెజారిటీ సాధించింది. వచ్చే ఎన్నికల్లో అదే రిపీట్ అవ్వడంతో పాటు అనంతపురంలోనూ మెజారిటీ రావాలని వ్యూహాలు రచిస్తున్నారు జగన్. ఇందులో భాగంగా షర్మిలకు సీమ ఇంచార్జ్గా బాధ్యతలు ఇచ్చి తాను మిగిలిన 9 జిల్లాలు పర్యవేక్షించవచ్చనేది, జగన్ ప్లాన్గా తెలుస్తోంది. సీమలో పార్టీ బలంగానే ఉంది కనుక, షర్మిలకు సీమ బాధ్యతలు అప్పగించి తాను మిగిలిన ప్రాంతంపై పుల్ టైం ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారట.
ఇదిలా ఉంటే షర్మిలకు కేవలం సీమ బాద్యతలే కాకుండా, ఈసారి ఎన్నికల బరిలోనూ దింపనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తల్లి విజయమ్మను విశాఖ ఎంపీగా పోటీ చెయ్యించినా ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి తాను ఎంపి స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతానని షర్మిల కోరినట్లు, దానికి జగన్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. షర్మిల మాత్రం బాబాయి వై.వి సుబ్బారెడ్డి నియోజకర్గం ఒంగోలు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. దీనికి సుబ్బారెడ్డి కూడా స్థానం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారట. ఒకవేళ ఒంగోలు కాకపోతే కడప నుంచి పోటీ చేయాలని పరిశీలిస్తున్నారు జగన్. అయితే షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై పార్టీ నేతలు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా షర్మిల వస్తే పార్టీకి ప్లస్ అవుతుందంటున్నారు. మరి జగనన్న వదిలే బాణం, ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.