వైసీపీ నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు లోటస్పాండ్కు క్యూ కడుతున్నారు. చివరి ప్రయత్నం చేసి ఎలాగైనా టిక్కెట్ సంపాదించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. సత్తెనపల్లి, బాపట్ల, నర్సరావుపేట నేతలు లోటస్ పాండ్ దగ్గర ఆందోళన చేపట్టారు. తమ నేతకే టిక్కెట్ ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. వైసీపీ అభ్యర్థులు జాబితా ఈనెల 16న విడుదల కానుంది. ఇడుపులపాయలో ఆ పార్టీ అధినేత జగన్ జాబితాను విడుదల చేయనుండడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో లోటస్ పాండ్ దగ్గరకి వైసీపీ ఆశావహులు క్యూ కడుతున్నారు.
జగన్ విడుదల చేయనున్న జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో అన్న టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొంది. ఈ క్రమంలో సత్తెనపల్లికి చెందిన అంబటి వ్యతిరేకవర్గం బ్రహ్మానందంరెడ్డి జగన్ కలిసేందుకు లోటస్ పాండ్ వద్దకు వచ్చారు. ఇటు కోన రఘుపతి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న గోవర్ధన్రెడ్డి ఆందోళన చేపట్టారు. మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సిట్టింగ్ సీటును తనకు కాకుండా వేరే వారికి కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి తనయుడు నాగార్జున రెడ్డికి.. మార్కాపురం టిక్కెట్ కేటాయించడంతో వెంకటరెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఇక తమ నేతకే టిక్కెట్ ఇవ్వాలంటూ వైసీపీ కార్యకర్తలు లోటస్ పాండ్ దగ్గరికి వందల సంఖ్యలో తరలిచ్చి ఆందోళన చేపట్టారు.