ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ చంద్రబాబు కుట్రలు తీవ్రస్థాయికి చేరుతున్నాయని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. రానున్న ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే ఎన్నికలని జగన్ అన్నారు. ఏపీలో ప్రతివార్డుకి చంద్రబాబు డబ్బుల మూటలు పంపిస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలను గ్రామాలలో ప్రతి మహిళకు వివరించాలని వైసీపీ కార్యకర్తలను జగన్ కోరారు. ఇక వైసీపీ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేరుస్తామని, వాటిని అమలు చేసిన తర్వాతే మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఓటు అడగుతామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి జగన్ మాట్లాడారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ , శ్రీకాకుళం లోక్సభ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్లను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టెక్కలి నియోజకవర్గంలో కూడా నా పాదయాత్ర సాగిందని ఆ పాదయాత్రలో మీరు చెప్పిన ప్రతి మాట, ఆవేదన, బాధలు, కష్టాలు నాకు ఇంకా గుర్తుకున్నాయి. ఈ రోజు మీ అందరికి నేను ఉన్నాననే భరోసా ఇస్తున్నానని అన్నారు.