ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరును ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. గురువారం పోలింగ్ పూర్తయిన తర్వాత రాత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రిటర్న్ గిఫ్ట్ ల వ్యవహారం చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య సాగిందని, అందులో తమకెలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం తగ్గించేందుకు కుయుక్తులు పన్నారన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలన్నారు. 80శాతం మంది ప్రజలు పోలింగ్లో పాల్గొన్నారని తెలిపారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు బురదజల్లుతున్నారని విమర్శించారు. మంగళగిరిలో లోకేశ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. ఓడిపోతున్నాడని తెలుసుకాబట్టే ఈసీని బెదిరిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని, ఇది ప్రజల విజయమని వైఎస్ జగన్ అన్నారు. రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. దేవుడి దయ వల్ల పోలింగ్ శాతం పెరిగింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారన్నారు. టీడీపీ దాడుల్లో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.