రాహుల్కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ని వివాదంలో పడేశాయి. నిన్న జైపూర్లో జరిగిన ఓ సభలో రాహుల్ లోక్ సభలో రాఫెల్ పై చర్చ సమయంలో మోడీ రాకపోవడాన్ని ఉద్ధేశించి కొన్ని ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ని వివాదంలో పడేశాయి. నిన్న జైపూర్లో జరిగిన ఓ సభలో రాహుల్ లోక్ సభలో రాఫెల్ పై చర్చ సమయంలో మోడీ రాకపోవడాన్ని ఉద్ధేశించి కొన్ని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ విమర్శలు రాహుల్ ను వివాదంలోకి నెట్టేశాయి. ఇదే అదునుగా బీజేపీ విమర్శలను ఎక్కుపెడుతోంది.
ఇటీవల లోక్సభలో రాఫెల్ వివాదంపై జరిగిన చర్చ గురించి ప్రస్తావిస్తూ విశాలమైన 56 అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకున్న మన చౌకీదారు, తనను కాపాడే బాధ్యతను ఓ మహిళకు వదిలేశారన్నారు. అక్కడితో ఆగకుండా, నిర్మలా మోడీ, తనను తాను రక్షించుకోలేని స్థితిలో ఉన్న మోడీ నిర్మలా సీతారామన్ ను ముందుకు నెట్టి, చర్చ నుంచి పారిపోయారని రాహుల్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ రాజకీయంగా కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
రాహుల్ జైపూర్లో చేసిన కామెంట్స్ పై.. ప్రధాని మోడీ ఆగ్రా సభలో తీవ్రంగా స్పందించారు. ఒక మహిళకు వదిలి అని రాహుల్ అనడాన్ని తప్పుబడ్డారు. ఇది కేవలం రక్షణమంత్రిని అవమానించడమే కాదు. యావత్ మహిళా లోకాన్ని, నారీశక్తిని కించపర్చే వ్యాఖ్యలన్నారు మోడీ. రాహుల్ లాంటి బాధ్యతారహిత నేతలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని తెలిపారు.
రాహుల్ మాత్రం తన కామెంట్స్ నుంచి వెనక్కి తగ్గలేదు. మోడీ వాఖ్యాలకు కౌంటర్ గా మరో ట్వీట్ చేశారు. మహిళను గౌరవించడమనేది ఇంటి నుంచే మొదలవుతుందన్నారు. మోదీజీ! వణికిపోకండి ఒక మనిషిగా నేనడిగే దానికి బదులు చెప్పండన్నారు. రాఫెల్ మొదటి ఒప్పందాన్ని మీరు తిరస్కరించినపుడు వైమానిక దళం, రక్షణ శాఖ అభ్యంతరం చెప్పాయా..? లేదా..? సమాధానమివ్వండంటూ ట్వీట్ చేశారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సీరియస్ గా పరిగణించింది. రాహుల్ కామెంట్స్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై వివరణ కోరుతూ రాహుల్కు నోటీసు జారీచేసింది. మరోవైపు, మహిళా సంఘాలు నేతలు రాహుల్ పై మండిపడుతున్నారు.
రాహుల్, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారమన్ ను మాత్రమే కాదు యావత్ మహిళాలోకాన్నే కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ కేంద్ర మంత్రితో పాటు మహిళలకు కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం, బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే రాహుల్ కామెంట్స్ పై అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆరోపిస్తున్నారు.