నారా లోకేష్ పోటీ చేసే నియోజకవర్గంపై క్లారిటీ వచ్చింది. ఏపీ రాజధాని ప్రాంతం నుంచి లోకేష్ బరిలోకి దిగనున్నారు. తీవ్ర చర్చోపచర్చల తర్వాత గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి లోకేష్ను పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, ఐటీశాఖ మంత్రి పోటీ చేసే స్థానంపై సందిగ్ధత వీడింది. ఒకసారి భీమిలి నుంచి మరోసారి విశాఖ నార్త్ నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరిగినా చివరి నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుంచి బరిలోకి దించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. అందుకు సరైన నియోజకవర్గం కోసం సెర్చింగ్ చేశారు. ఎక్కడ్నుంచి పోటీకి దిగితే బాగుంటుందనే విషయంపై పార్టీలో చర్చోపచర్చలు జరిగాయి. అందులో భాగంగానే ఒకసారి భీమిలి మరోసారి విశాఖ నార్త్ తెరపైకి వచ్చాయి. అయితే విస్తృత చర్చల అనంతరం లోకేష్ను మంగళగిరి నుంచి బరిలోకి దించాలని చంద్రబాబు నిర్ణయించారు.
రాజధాని ప్రాంతంగా మంగళగిరి అభివృద్ధి చెందడంతో పాటు మున్ముందు సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే లోకేశ్ మంగళగిరి నుంచి బరిలో దిగితేనే బాగుంటుందని బాబు భావించినట్టు తెలుస్తోంది. మొత్తానికి మంగళగిరిని ఎంచుకున్న నారా లోకేష్ స్థానిక నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.