రాబందు ఈ పేరు వినడమే కానీ, నిజంగా చూసిన వాళ్ళు ఈతరం లో తక్కువనే చెప్పొచ్చు. ఎక్కడన్నా జూ లోనో.. లేదా సినిమాలోనో చూసి ఇదే రాబందు అనుకోవచ్చు. కానీ పాతికేళ్ల క్రితం హైదరాబాదులో వందల రాబందులు ఉండేవి. క్రమేపి నగరం పెద్దది అయింది.. రాబందుల రెక్కలు విరిగిపోయాయి. ఆ జాతి దాదాపు కనుమరుగైపోయింది. ఇదిగో ఇపుడు అనుకోకుండా ఓ రాబందు ప్రత్యక్షమైంది. దీంతో ఎన్నాళ్లకెన్నాళ్లకు అంటూ ఈ వార్త విన్న పక్షి ప్రేమికులు సంబరపడిపోతున్నారు.
ఆసిఫ్నగర్ క్రాస్రోడ్స్ ప్రాంతంలో రాబందు ఉందన్న సమాచారంతో శుక్రవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్లిన అటవీశాఖ అధికారులు దానిని పట్టుకున్నారు. బాగా నీరసించి పోయి, ఎగరలేని స్థితిలో ఉన్న రాబందును నెహ్రూ జూలాజికల్ పార్క్కు తరలించారు. నిన్న మధ్యాహ్నానికి రాబందు కొంత కోలుకుందని, మాంసం తీసుకుందని అటవీ అధికారులు తెలిపారు. తెల్లవీపు కలిగిన రాబందులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అంతరించే దశలో ఉన్నాయి.
1999లో చివరిసారిగా హైదరాబాద్లోని హయత్నగర్ సమీపంలో ఉన్న 'మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్' పరిసరాల్లో ఈ తెల్లవీపు రాబందు కనిపించింది. అదే ఆఖరు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే. తెలంగాణలోని కాగజ్నగర్ ప్రాంతంలో రాబందులు ఉన్నా అవి పొడుగు మూతి రకం జాతి పక్షులని అధికారులు పేర్కొన్నారు.