ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం, మంత్రులెవరూ ఫోన్లు తీసుకురావద్దని ఆదేశం ..
అనేక విషయాల్లో దూకుడు ప్రదర్శించే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జరగనున్న కీలకమైన కేబినెట్ భేటీల్లో మంత్రులెవరూ ఫోన్లు తీసుకురావద్దని ఆదేశించారు. మీటింగ్లకు వచ్చి కూడా మంత్రులంతా మొబైల్స్ చూస్తూ వాట్సాప్లలో మునిగిపోతున్నారన్న దానిపై సీఎం యోగి సీరియస్ అయినట్లు సమాచారం. అందుకోసమే నిర్ణయం తీసుకుంది. ఇకపై మంత్రివర్గ సమావేశాల్లో మంత్రులు ఎవరూ మొబైల్స్ వాడకూడదంటూ నిషేధం విధించింది.
దీనిపై సీఎం కార్యాలయ నుండి ఓ అధికారి ఒకరు స్పందించారు. ఇప్పటి వరకు మొబైల్స్ను సైలెంట్ మోడ్లో పెట్టి తీసుకొచ్చేందుకు మంత్రులకు అనుమతి ఉండేదన్నారు. అయినప్పటికీ వాట్సాప్ మెసేజ్లను చదవడంలో, పంపడంలో మంత్రులు మునిగిపోతున్నారన్నారు. ఈ కారణంతోనే.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై జరిగే సమావేశాలకు మంత్రులు ముందుగా తమ ఫోన్లను డిపాజిట్ చేసి రావాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.