నిజామాబాద్ జిల్లాలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆర్మూరు మండలం పిప్రిలో ఓట్ల లెక్కింపులో వింత పరిస్థితి నెలకొంది. తొలుత ఓ అభ్యర్థి గెలవగా రీ కౌంటింగ్లో పరిస్థితులు మారిపోయాయి. చివరకు విజేత ఎవరో తెలుసుకోవడానికి లాటరీ తీయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే...పిప్రిలో మొదట జరిపిన ఓట్ల లెక్కింపులో రెండు ఓట్ల మెజారిటీతో ఎంపీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. దీనిపై బీజేపీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా రీ కౌంటింగ్కు పట్టుబట్టారు. దీంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే రీకౌంటింగ్లో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులిద్దరికీ చెరో 690 ఓట్లు రావడం గమనార్హం. దీంతో ఎన్నికల అధికారులు విజేతను నిర్ణయించేందుకు లాటరీ పద్ధతిని ఆశ్రయించడంతో అనూహ్యంగా విజయం బీజేపీ అభ్యర్థిని వరించింది. చివరకు అధికారులు బీజేపీ అభ్యర్థి ఎర్రవ్వ ఎంపీటీసీగా గెలుపొందినట్టు ప్రకటించారు.