డేటా చోరీ వ్యవహారంలో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీ సీఈఓ అశోక్ కోసం తెలంగాణ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ప్రధాన నిందితుడైన అశోక్ లొంగిపోవాలంటూ నోటీసులు జారీ చేసిన గడువు ముగియడంతో అతని కోసం సైబరాబాద్కు చెందిన 3 పోలీసు బృందాలు ఏపీలో గాలిస్తున్నాయి. అశోక్ దేశం వదిలి పారిపోయే అవకాశం లేకుండా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులకు సైబరాబాద్ పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేశారు.
మరోవైపు రెండ్రోజులుగా ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్, హార్డ్డిస్క్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిన సైబరాబాద్ పోలీసులు ఆ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకంగా మారడంతో ఆ నివేదిక అందాక తదుపరి చర్యలు తీసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. అయితే ఐటీ గ్రిడ్స్ కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ రేపు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక ఐటీ గ్రిడ్స్ సంస్థకు సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరిస్తున్న అమెజాన్, గూగుల్ సంస్థల వివరణ కోరుతూ ఇప్పటికే నోటీసులు ఇచ్చిన పోలీసులు నేడు మరికొంత మందికి నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.