జిల్లా పరిషత్ ఎన్నికల్లో తెరాస ప్రభంజనం సృష్టిస్తోంది. ఆయా జిల్లాల్లో స్పష్టమైన మెజార్టీతో అత్యధిక జడ్పీ పీఠాలను కైవసం చేసుకుంటూ 'కారు' దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వెలువడిన జడ్పీటీసీ ఫలితాల ప్రకారం.. 15 జిల్లా జడ్పీ పీఠాలు తెరాసకు దక్కనున్నాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జడ్పీ పీఠాలు గులాబీ ఖాతాలలో చేరాయి. నిజామాబాద్, కామారెడ్డిపై తెరాస జెండా రెపరెపలాడింది. సంగారెడ్డి, వరంగల్ అర్బన్, ములుగు జడ్పీలు అధికార పార్టీకి దక్కనున్నాయి. మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి సహా ఖమ్మంలోనూ తెరాస హవానే కొనసాగింది. ఇక సిద్దిపేట నియోజకవర్గంలోనైతే తెరాస క్లీన్స్వీప్ చేసింది. జడ్పీ పీఠాలు తెరాస వశం కావడంతో గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 12 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. ఇప్పటివరకు ఎనిమిది స్థానాలు గులాబీ ఖాతాలో చేరడంతో సిరిసిల్ల జడ్పీ పీఠం తెరాస కైవసం కానుంది. కరీంనగర్లో 15 జడ్పీటీసీ స్థానాలు ఉండగా 10 స్థానాల్లో అధికార పార్టీ జయభేరి మోగించింది. దీంతో కరీంనగర్ జడ్పీ కూడా తెరాసనే కైవసం చేసుకోనుంది. కామారెడ్డి జిల్లాలో 22 జడ్పీటీసీ స్థానాలు ఉండగా 13 స్థానాల్ని గెలుచుకోవడంతో కామారెడ్డి జడ్పీపైనా గులాబీ జెండా రెపరెపలాడనుంది. పెద్దపల్లిలో 13 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 10 స్థానాల్ని గెలుచుకున్న తెరాస జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. నిజామాబాద్ జడ్పీ కూడా అధికార పార్టీ ఖాతాలోనే పడింది. జోగులాంబ - గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్ అర్బన్, మహబూబ్నగర్, సిద్దిపేట జడ్పీ పీఠాలు తెరాసనే కైవసం చేసుకుంది. ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలోని ఐదుకు ఐదు జడ్పీటీసీ స్థానాలు తెరాస వశమయ్యాయి.