తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు తేదీ ఖరారైంది. ఈ నెల 18వ తేదీన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ప్రకటించారు. నాంపల్లి విద్యాభవన్లో ఫలితాలను విడుదల చేస్తామని ఆయన చెప్పారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ఒకేసారి జరిగాయి. అయితే ఏపీలో ఫలితాలు ఇప్పటికే విడుదల కాగా, తెలంగాణలో మాత్రం ఆలస్యమైంది. ఫలితాల విడుదలపై రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ వార్తలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సందేహాలను నివృత్తి చేస్తూ ఇంటర్ బోర్డ్ కొద్ది రోజుల క్రితం త్వరలో ఫలితాలు వెల్లడిస్తామని క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో ఈనెల 18న ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఈరోజు ప్రకటించింది ఇంటర్ బోర్డ్.