శాసనసభ ఎన్నికల ఫలితాల లాగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా ఏకపక్షంగా వస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు . మొత్తం 16 ఎంపీ స్థానాలకు గాను 16స్థానాలు మనవే అని పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలని కేసీఆర్ సూచించారు .. బుధవారం ఆయన తన నివాసంలో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. జిల్లాల్లోని మంత్రులు, పార్టీ అభ్యర్థులు, శాసనసభ్యులు, మండలి సభ్యులతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల్లో తెరాస సత్తా చాటుతుందని అన్నారు.
ఓట్ల లెక్కింపు దగ్గర చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మంత్రులు ఓట్ల లెక్కింపు ఏజెంట్లకు అన్ని విధాలా జాగ్రత్తలు చెప్పాలన్నారు. ఎక్కడయినా సమస్య తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. తెలంగాణభవన్ వద్ద ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని, ఏమైనా సందేహాలుంటే సంప్రదించాలని అన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల విధానానికి తెరాస పూర్తిగా మద్దతు ఇచ్చిందని, విపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు.