ఆ జిల్లాల్లో జనసేనదే హవా..: టీడీపీ ఎంపీ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు

Update: 2019-05-04 10:07 GMT

ఏపీ సార్వత్రిక సమరంలో ప్రచారంలో హోరాహోరి జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్దంతో సాగింది. ఇక కొత్తగా పార్టీ స్థాపించి సార్వత్రిక సమరంలో నేను ఉన్నానంటూ తన దైనశైలీలో ప్రచారం నిర్వహించింది జనసేన. ఈ నేపథ్యంలో ఎన్నికల సమీక్షలో భాగంగా నేడు రాజమండ్రి పార్లమెంటరీ నియోజక వర్గంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ప్రస్తావించారు. కాగా జనసేన పార్టీ పోటీచేసిన స్థానాలపై టీడీపీ అభ్యర్థి మాగంటి రూప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం భారీ స్థాయిలో ఉందని అన్నారు.

ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన చెప్పుకోదగ్గ స్థానాలు దక్కించుకునే అవకాశం తప్పక ఉందన్నారు. ఇక తూ.గో, ప.గోజిల్లాల్లో జనసేన పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువగానే పోటీ ఇచ్చిందని అన్నారు. అక్కడ ముఖ్యంగా యువత, మధ్యతరగతి కుటుంబాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల ఆకర్షితులై ఒక వర్గం ఓట్లు మొత్తం జనసేనకు గుండుగుత్తగా పడ్డాయని రూప విశ్లేషించారు. మిగితా జిల్లాల సంగతి ఎలా ఉన్నప్పటికీ ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం జనసేన చాలా గట్టిపోటీ ఇచ్చిందని తెలిపారు. ఇక చివరగా మాట్లాడుతూ రాజమండ్రి లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని రూప తెలిపారు.  

Similar News