రానున్న అసెంబ్లీ ఎన్నికలు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై టీడీపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 126 మందితో తొలి జాబితాలను విడుదల చేసిన టీడీపీ తాజాగా మరో 15 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్పటి దాకా 141 మంది అభ్యర్థులను టీడీపీ ప్రకటించినట్టయ్యింది. అయితే, రెండో జాబితాలో మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మళ్లీ రాయదుర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించగా మరో ఇద్దరు వారసులకు సీట్లు కేటాయించారు పార్టీ అధినేత చంద్రబాబు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది టీడీపీ. అందులో భాగంగా మరో 15 మంది అభ్యర్థులతో రెండో జాబితాలను విడుదల చేసింది. ఈ జాబితాలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మ, రంపచోడవరం నుంచి వంతల రాజేశ్వరి, పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నుంచి గన్ని వీరాంజనేయులు, కృష్ణాజిల్లా పెడన నుంచి కాగిత వెంకటకృష్ణ ప్రసాద్, పామర్రు నుంచి ఉప్పులేటి కల్పన, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నుంచి పర్సా వెంకటరత్నం, కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి బండి జయరాజు, బనగానపల్లి నుంచి బీసీ జనార్ధన్, అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, తాడిపత్రి నుంచి జేసీ అశ్మిత్రెడ్డి, మడకశిర నుంచి కె.ఈరన్న, చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి దమ్మలపాటి రమేశ్, చిత్తూరు నుంచి ఏఎస్ మనోహర్ పేర్లను ప్రకటించింది టీడీపీ.
అయితే, మంత్రి కాల్వ శ్రీనివాసులుకు టిక్కెట్టు ఇవ్వొదంటూ స్థానికంగా పెద్ద ఎత్తున అసమ్మతి వ్యక్తమైంది. అయినా అంతగా పట్టించుకోని అధిష్టానం ఆయనకు అనంతపురం రాయదుర్గం నుంచి పోటీ చేసేందుకు మరోసారి అవకాశం కల్పించింది. అలాగే, తొలి జాబితాలో 10 మంది వారసులకు టిక్కెట్లు ఇచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు రెండో జాబితాలోనూ మరో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు. కృష్ణాజిల్లా పెడన సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్కు కేటాయించగా అనంతపురం జిల్లా తాడిపత్రి సీటును జేసీ ప్రభాకర్రెడ్డి తనయుడు అశ్మిత్రెడ్డికి ఇచ్చారు చంద్రబాబు.
ఈ రెండు జాబితాలతో కలిసి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల సంఖ్య ఇప్పటికి 141కి చేరింది. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తోంది హైకమాండ్. అయితే, అమలాపురం అసెంబ్లీ స్థానంతోపాటు రాజమండ్రి, అమలాపురం లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులు ఖరారైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయా స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఇవాళ ప్రకటించనున్నారు సీఎం చంద్రబాబు.
రెండో జాబితాలోని అభ్యర్థులు
1. పాలకొండ- నిమ్మక జయకృష్ణ
2. పిఠాపురం- ఎస్వీఎస్ఎన్ వర్మ
3. రంప చోడవరం- వంతల రాజేశ్వరి
4. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు
5. పెడన- కాగిత వెంకటకృష్ణ ప్రసాద్
6. పామర్రు- ఉప్పులేటి కల్పన
7. సూళ్లూరుపేట- పర్సా వెంకటరత్నం
8. నందికొట్కూరు- బండి జయరాజు
9. బనగానపల్లి- బీసీ జనార్దన్రెడ్డి
10. రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు
11. ఉరవకొండ- పయ్యావుల కేశవ్
12. తాడిపత్రి- జేసీ అశ్మిత్రెడ్డి
13. మడకశిర- కె.ఈరన్న
14. మదనపల్లి- దమ్మలపాటి రమేశ్
15. చిత్తూరు- ఏఎస్ మనోహర్