కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చౌకీదార్ చోర్ వ్యాఖ్యలపై కోర్టును తప్పుదారి పట్టిస్తారా అని ప్రశ్నించింది. తాము ఎక్కడా అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న న్యాయస్థానం ఇప్పటివరకు రాహుల్ ఎందుకు క్షమాపణ చెప్పలేదని ప్రశ్నించింది. తాము చేయని వ్యాఖ్యలను తమకెలా ఆపాదిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ సమర్పించిన అఫిడవిట్లో చింతిస్తున్నా అనే పదాన్ని బ్రాకెట్లో ఎందుకు చేర్చారని కూడా అడిగింది. అలాగే రెండు అఫిడవిట్లు ఎందుకు సమర్పించాల్సి వచ్చిందో చెప్పాలని స్పష్టం చేసింది.
అయితే ఎట్టకేలకు రాహుల్ సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. తన తరపు లాయర్ అభిషేక్ సింఘ్వీతో క్షమాపణలు తెలిపారు. న్యాయస్థానానికి ఆ వ్యాఖ్యలు ఆపాదించడం తప్పే అని అఫిడవిట్లో మూడు చోట్ల తప్పులు దొర్లాయని అభిషేక్ సింఘ్వీ ఒప్పుకున్నారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం మరో అఫిడవిట్ దాఖలుకు అవకాశం ఇచ్చింది. అలాగే గతంలో సమర్పించిన రెండు అఫిడవిట్లను పరిగణలోకి తీసుకోమ్మని తెలిపింది. తదుపరి విచారణను మే 6 కు వాయిదా వేసింది.