తెలంగాణ పర్యటనకు సోనియా, రాహుల్

Update: 2019-04-05 05:04 GMT

తెలంగాణలో పోలింగ్‌కు గడువు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారానికి వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లుండి వికారాబాద్‌ జిల్లాలో జరిగే సభకు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరవుతారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8న పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం, మీర్జాపూర్‌ గేటు దగ్గర భారీ బహిరంగ సభకు సోనియా హాజరు కావాల్సి ఉంది. అయితే అదే రోజు వికారాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగసభ ఉండటంతో సోనియా సభకు పోలీసు శాఖ నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఈనెల 7వ తేదీనే అంటే ఒకరోజు ముందుగానే వికారాబాద్‌ జిల్లాకు వస్తున్నారు. పూడూరు మండలం, మీర్జాపూర్‌ గేటు దగ్గర సాయంత్రం 4 గంటలకు సోనియా సభ జరగనుంది.

ఇప్పటికే తెలంగాణలో రెండు సార్లు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ నెల 8వ తేదీన మరోసారి వస్తున్నారు. ప్రచారం ముగిసే గడువునకు ముందురోజు అంటే 8వ తేదీన భువనగిరి, మహబూబాబాద్‌ బహిరంగసభల్లో రాహుల్ ప్రసంగిస్తారు. అదేరోజు సాయంత్రం సికింద్రాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో జరిగే ర్యాలీలో రాహుల్‌ గాంధీ పాల్గొంటారు. ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందే రాహుల్ శంషాబాద్‌లో, ఏప్రిల్‌ ఒకటో తేదీన జహీరాబాద్‌, వనపర్తి, హుజూర్‌నగర్‌ బహిరంగసభల్లో ఆయన పాల్గొన్నారు. అయితే భువనగిరి లోక్‌సభ అభ్యర్థి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాహుల్‌ను కలిసి భువనగిరి లోక్‌సభ పరిధిలో సభకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో ఈ నెల 8న రాహుల్‌ మలివిడత ప్రచారానికి వస్తున్నారు. 

Similar News