ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈనెల 14న మంత్రివర్గ సమావేశానికి సీఎస్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా శాఖాధిపతులకు కేబినెట్ అజెండాను పంపిన సీఎస్, సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. అయితే నేడు సమావేశంకానున్న స్క్రీనింగ్ కమిటీ అసలు అవి మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలేనా? కాదా? అనేది చర్చించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికివ్వనుంది.
మంత్రివర్గ సమావేశానికి ఏర్పాట్లు చేయాలంటూ సీఎంవో నుంచి సెకండ్ నోట్ రావడంతో ఆయా శాఖాధిపతులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం... దిశానిర్దేశం చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కేబినెట్ మీటింగ్ను ఏవిధంగా నిర్వహించాలనే దానిపై సీఎంవో, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే సీఎంవో పంపిన కేబినెట్ అజెండాను ఆయా శాఖలకు పంపిన సీఎస్ ఫోని తుపాను నష్టం, కరవు, తాగునీరు, నరేగా నిధుల చెల్లింపులపై సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
అయితే ఎప్పుడు కేబినెట్ భేటీ జరిగినా, అన్ని శాఖల మంత్రులకు, ముఖ్యకార్యదర్శులకు సమాచారం ఇవ్వడం ఆనవాయితీ, కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో కేబినెట్ అజెండాలోని శాఖలకు మాత్రమే సమాచారం ఇచ్చారు. దాంతో ఒకవేళ కేబినెట్ మీటింగ్ జరిగితే, ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు కేవలం ఆ శాఖల అధికారులు మాత్రమే హాజరుకానున్నారు. ఇక ఆయా శాఖల నుంచి సమాచారం అందగానే సీఎస్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. వివరాలను పరిశీలించి, అసలు అవి తప్పనిసరిగా కేబినెట్లో చర్చించదగిన అంశాలేనా? కాదా? అనేది చర్చించి, నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించనున్నారు. సీఈసీ నిర్ణయం తర్వాతే కేబినెట్ మీటింగ్ ఉంటుందా? లేదా? అనేది క్లారిటీ రానుంది.