రైలు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా మత్తు మందిచ్చి చోరీకి పాల్పడ్డారు. యశ్వంత్ పూర్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో దోపిడీకి తెగబడ్డారు. కూల్ డ్రింక్స్లో మత్తు కలిపి, ప్రయాణికులను దోచుకున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు 15వేల రూపాయల నగదు, సెల్ఫోన్లు ఎత్తుకెళ్లిపోయారు. బాధితులు కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరు నుంచి బయలురేరిన సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లోని జనరల్ బోగీలో కొందరు కూర్చుని మాటలు కలిపి ప్రయాణికులకు బిస్కట్లు, కూల్ డ్రింక్స్ ఇచ్చారు. వాటిని తీసుకున్న ఆరుగురు ప్రయాణికులు మత్తులోకి జారుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా వీళ్లంతా మత్తు నుంచి బయటికి రాకపోవడంతో తోటి ప్రయాణికులు గుర్తించి సికింద్రాబాద్ స్టేషన్ దాటాక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో కాజీపేటలో రైలును ఆపి మత్తులో ఉన్నవారిని కిందకి దింపి వరంగల్ ఎంజీఎంకి తరలించారు.
బాధితుల్లో కొందరు ఇప్పటికీ స్పృహలోకి రాలేదని తెలుస్తోంది. నలుగురు కోలుకోగా ఇద్దరు అపస్మారకస్థితిలోనే ఉన్నారు. బాధితుల్లో కర్నాటకకు చెందిన నితిన్ జైన్, రాహుల్ బీహార్కి చెందిన ప్రేమ్శంకర్ అలాగే యూపీకి చెందిన టింక్, సూర్యకాంత్, అబ్బాస్ ఖాన్ ఉన్నారు. ఈ ఘటనలో 6 సెల్ఫోన్లు, గోల్డ్ రింగ్, 15వేల నగదు, పర్సులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.