చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చెదుముదురు ఘటనలు మినహా రీపోలింగ్ నిర్వహణ సక్రమంగానే జరిగింది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో రిగ్గింగ్కు అవకాశం లేకుండాపోయింది. రీపోలింగ్ జరిగిన 7 పోలింగ్ బూత్ల్లో 89.29 శాతం ఓటింగ్ జరిగింది. అయితే, ఏప్రిల్ 11న జరిగిన ఓటింగ్ కంటే ఈ సారి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఏడు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పాకాల మండల పరిధిలోని పులివర్తిపల్లి, కుప్పంబాదురు, రామచంద్రాపురం మండలంలోని ఎన్.ఆర్.కమ్మపల్లి, కమ్మపల్లి, కొత్తకండ్రిగ, వెంకటరామపురం, కాళేపల్లిలో రీ పోలింగ్ జరిగింది. ఏడు కేంద్రాల్లో కలిపి 89.29 శాతం పోలింగ్ నమోదైంది.
రీపోలింగ్ జరిగిన ఏడు కేంద్రాల్లో ఓటింగ్ శాతం చూస్తే... పులివర్తిపల్లిలో 95.03శాతం, కాలేపల్లిలో 94.64, వెంకట్రామాపురంలో 89.66, కొత్త కండ్రిగలో 84.86, కమ్మపల్లిలో 83.56, ఎన్.ఆర్. కమ్మపల్లిలో 88.83, కుప్పం బాదూరులో 92.04 శాతం పోలింగ్ నమోదైంది. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 5 వేల 451 మంది ఓటర్లు ఉండగా... 4వేల 867 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఏప్రిల్ 11న జరిగిన ఓటింగ్ కంటే ఈ సారి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. ఏప్రిల్ 11న ఈ పోలింగ్ బూత్లలో 90.42 శాతం ఓటింగ్ నమోదైంది.
అక్కడక్కడా చెదుముదురు ఘటనలు మినహా రీపోలింగ్ నిర్వహణ సక్రమంగానే జరిగింది. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని స్వగ్రామం పులివర్తిపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు నానిపై కేసు నమోదు చేశారు. ఇక కమ్మపల్లిలో దొంగ ఓటు వేయడానికి వచ్చాడనే అనుమానంతో మునిచంద్రనాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడు పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా అధికారులు పరిశీలించారు. దీంతో చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.