రాజోలు ఎమ్మెల్యేగా జనసేన పార్టీ నుంచి విజయం సాధించిన ఏకైక అభ్యర్థి రాపాక వరప్రసాద్. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి కూడా విజయం దక్కించుకోకపోగా రాపాక ఒక్కరే గెలిచి ఆ పార్టీకి ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కేలా చేశారు. ఏపీలో జనసేన పార్టీ అధినేతతో సహా ప్రముకులందరూ ఓడిపోయిన వేళ జనసైనికుల గొంతు అసెంబ్లీలో వినిపించడానికి ఒక్కరే మిగిలారు. రాజోలు జనసైనికుడు రాపాక వరప్రసాద్ విజయం సాధించాడు. జనసేన అభిమానులకు ఉన్న ఒకే ఒక్క ఊరడింపు రాజోలు సీటు గెలవడం.
మల్కిపురం నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాపాక 2009లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 30 ఏళ్లుగా క్షత్రియ సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్న రాజోలు నియోజకవర్గం రాష్ట్ర విభజన తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 15 వేల ఓట్లు సాధించి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీలో చేరారు.
2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరిగా జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగారు. రాపాక విజయంలో ఎస్సీ సామాజిక వర్గంతో పాటు కాపు, క్షత్రియ సామాజిక వర్గం కూడా కీలక పాత్ర పోషించింది. ఈ విజయం ఆనందంగా ఉందన్న ఆయన మార్పు ఎప్పుడూ ఒకరితోనే మొదలవుతుందని తమ అధినేత నమ్ముతారని ఆ మార్పే ఇప్పుడు మొదలైందన్నారు. 2024 లో విజయం మాదేనని ఆయన అంటారు. మరి రాపాక జనసేన లోనే ఉంటారా లేక జగన్ చెంతకు చేరుతారా అనేది కాలమే చెప్పాలి.