తెలంగాణలో ఎట్టకేలకు లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. కానీ పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయింపుతో ఓటర్లు తీవ్ర ఇబ్బందిపడ్డారు. కొన్నిచోట్ల ఈవీఎంల సమస్యతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈవీఎంలు మొరాయింపుతో సుమారు గంటకుపైగా ఓటర్లు క్యూ లైన్ లోనే ఉండాల్సి వచ్చింది. తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్ధులతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు చోట్ల ఓటర్లతో కలిసి క్యూలైన్లో నిలుచొని ఓటు వేశారు.
మొత్తంగా 70 శాతం వరకు పోలింగ్ నమోదైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నగరంలోని సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో పోలింగ్ మందకొడిగా సాగింది. అయితే 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి బూత్లో 12 ఈవీఎంలను వినియోగించారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా ఒక్క నిజామాబాద్లో మాత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల యత్రాంగం ఊపిరి పీల్చుకుంది.