చీరాల రాజకీయ పంచాయితీ రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తనకు కేటాయించిన గన్మెన్లను మార్చమని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చీరాల వైసీపీ ఇంచార్జ్ యడం బాలాజీ ఎస్పీని కలిసి నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించాలని కోరారు. ఇంతకీ ఇద్దరు నేతలు పోటీ పడి ఎందుకు జిల్లా పోలీస్ బాస్ ను కలిశారు అసలు చీరాల నియోజకవర్గంలో ఏం జరుగుతోంది.
ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలు హాట్ టాపిక్లా మారాయి. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో రాజకీయం హీట్గా మారిపోయింది. ఆమంచి పార్టీ మారడంతో పాటు రోజుకో కామెంట్ చేస్తూ వేడి పుట్టిస్తున్నాడు.
ఆమంచి వైసీపీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుత నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న యడం బాలాజీ పార్టీ చీఫ్ జగన్ కు బహిరంగ లేఖ రాశారు. అంతేకాక ఆమంచికి పార్టీ టికెట్ ఇస్తే అతన్ని ఓడించడానికి పని చేస్తామని చెబుతున్నారు. ఈ విషయాన్ని జగన్ కు సైతం వివరించారు.
నేతలు ఒక్కక్కరు జిల్లా పోలీసుల కార్యాలయం మెట్లు ఎక్కడం ప్రారంభించారు. తనకు పని చేసే గన్ మెన్లు తనను రక్షించడం కంటే ఇంటెలెజెన్స్ వ్యవస్థకు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తనకు కేటాయించిన గన్ మెన్లను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆమంచి ఓటమే ధ్యేయమంటున్న నేత కూడా జిల్లా ఎస్పీని కలిశారు. రాబోయే రోజుల్లో చీరాల నియోజవకర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇద్దరు నేతలు పోలీసుల అధికారుల పంచన చేరుతున్నారు. ముందుగానే పోలీసులను ప్రసన్నం చేసుకుంటున్నారా అనేది చర్చగా మారింది.