చీరాల వైసీపీ అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచార గడువు ఏపీలో 6గంటలకే ముగిసింది. అనంతరం రాజకీయ పార్టీలు ఎటువంటి సమావేశాలు గానీ, సభలు గానీ, రోడ్ షోలు గానీ నిర్వహించకూడదని ఈసీ స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆమంచి సమావేశం నిర్వహించడంతో ఆయనపై కేసు నమోదైనట్లు తెలిసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంగించి వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో సమావేశం ఏర్పాటు చేయడంతో ఆమంచిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నిబంధనలు అతిక్రమించి సమావేశం నిర్వహించారని అభియోగం మోపారు. అయితే తాను కేవలం బూత్ కమిటీ సమావేశం నిర్వహించానని ఆమంచి అంటున్నారు. పోలీసులు అనవసరంగా తనపై కేసు నమోదు చేశారని చెప్పారు. పోలీసుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.