ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలాయి. కర్నూలు ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు టార్గెట్గా మోడీ విమర్శనాస్త్రాలు సంధించారు. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ కావాలో పుత్రోదయ ఏపీ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మోడీ కామెంట్స్కు అదే స్థాయిలో స్పందించిన చంద్రబాబు మోడీకి పిల్లలు లేరు కాబట్టే ఆ వాత్సల్యం తెలియదని మండిపడ్డారు. మోడీకి కుటుంబాలు, అనుబంధాలు తెలియవని, రోబోకి, మోడీకి తేడాయే లేదని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.
ఏపీలో డబుల్ ఇంజిన్తో పాలన కావాలంటే ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో భాజపాకు ఓటువేసి గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. డబుల్ ఇంజిన్ అంటే కేంద్ర రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వం ఉండాలని ఆయన వివరించారు. కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో పుత్రుడి రాజకీయ భవిష్యత్తుకు సూర్యాస్తమయం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధిలో కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సహకరించట్లేదని మోదీ ఆరోపించారు.