తెలంగాణలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 123 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రారంభించారు. ఆ తర్వాత మొత్తం 536 స్ట్రాంగ్ రూంల్లో భద్రపర్చిన బ్యాలెట్ బాక్స్లను నిర్ధేశించిన లెక్కింపు కేంద్రాలకు తీసుకువచ్చి ఓట్లను లెక్కించనున్నారు. రాష్ట్రంలో 3 విడతల్లో మొత్తం 534 జెడ్పీటీసీ, 5659 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. పరిషత్ ఎన్నికల్లో 1 కోటి 20లక్షల 86 వేల 385 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కౌంటింగ్ లో ముందుగా ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కించి, ఆ తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. ఒక రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కించనుండగా ఒక్కో స్థానానికి రెండు రౌండ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం 978 కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేయగా 11,882 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 23,647 మంది కౌంటింగ్ అసిస్టెంట్లతో కలుపుకుని మొత్తం 35,529 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. సాయంత్రం 5 గంటల వరకు లెక్కింపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం నుంచే ఫలితాల తెలిసే అవకాశం ఉంది.