సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ రాజకీయ ప్రత్యర్ధులపై ప్రధాని నరేంద్రమోడీ దూకుడు పెంచారు. ఏపీ టూర్లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును డైరెక్ట్గా టార్గెట్ చేశారు. గుంటూరు సభలో చంద్రబాబే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అధికారం కోసం ఎవరితోనైనా జతకట్టే బాబుకి ప్రస్తుతం ఓటమి భయం పట్టుకుందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకసారి గెలిస్తే మరోసారి గెలిచిన చరిత్ర చంద్రబాబుకి లేదన్నారు. రాజకీయ స్వార్థం కోసమే చంద్రబాబు మహా కల్తీ కూటమిలో చేరారన్న మోడీ ఎన్టీఆర్ను అవమానించిన కాంగ్రెస్తో ఎలా చేతులు కలుపుతారని నిలదీశారు.
మోడీ కంటే తానే సీనియర్నన్న బాబు వ్యాఖ్యలపైనా మోడీ సెటైర్లు వేశారు. పార్టీ ఫిరాయింపుల్లో మీరు సీనియర్. వెన్నుపోటు రాజకీయాల్లో సీనియర్. ఎన్నికల్లో ఓడిపోవడంలోనూ మీరే సీనియర్ అంటూ చంద్రబాబుపై వరుస సెటైర్లు వేశారు. ఈ విషయాల్లో చంద్రబాబుతో తాను పోటీపడలేనన్నారు. తనకన్నా సీనియర్నని చెప్పుకుంటున్న చంద్రబాబు తన సీనియారిటీతో ఏం సాధించారో అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు మోడీ.
రాష్ట్రాభివృద్ధిని పక్కనబెట్టి తన కుమారుడిని రాజకీయాల్లో పైకి తీసుకురావడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఇస్తోన్న ప్రతి పైసాకి లెక్క అడుగుతుంటే చంద్రబాబు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. నన్ను తిట్టడం సరే ముందు ఏపీ నిలదీస్తోంది సమాధానం చెప్పండి చంద్రబాబూ అంటూ మోడీ నిలదీశారు. చంద్రబాబు ఎన్ని రాజకీయ జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మడం లేదని మోడీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమన్న మోడీ తండ్రీకొడుకుల కొడుకుల రాజకీయం త్వరలోనే అంతం కాబోతుందని జోస్యం చెప్పారు. జనం కోరుకుంటున్న మార్పు ఈ ఎన్నికల తర్వాత వస్తుందన్న మోడీ జై ఆంధ్రా నినాదంతో ప్రసంగం ముగించారు.
ఇదిలా ఉంటే ఏపీ పర్యటనలో ప్రధాని మోడీ మూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించారు. విశాఖలో 1178కోట్లతో నిర్మించిన చమురు నిల్వ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. అలాగే కృష్ణపట్నం పోర్టు దగ్గర 700 కోట్లతో నిర్మించిన బీపీసీఎల్ టర్మినల్ శంకుస్థాపన చేశారు. ఇక అమలాపురం దగ్గర ఓఎన్జీసీ వశిష్ట, ఎస్1 ఆన్షోర్ ప్రాజెక్టును రిమోట్ ద్వారా ప్రారంభించారు.